
AP Rains: ఏపీకి మరోసారి తుపాను ముప్పు.. ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం..
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రానికి మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.
ఆ తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది.
ఇది ఈనెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా మారుతుందని కొన్ని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి.
ఇది తీవ్ర వాయుగుండంగా మారి, ఈనెల 17 నాటికి ఆంధ్రప్రదేశ్లో తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ భావిస్తోంది.
ఇది తుపానుగా బలపడి ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో ఈనెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చని అమెరికా వాతావరణ నమూనా అంచనా వేస్తోంది.
అల్పపీడనం ఏర్పడ్డాక దీనిపై స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
ఈనెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు
ఈ ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈనెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. కర్ణాటక, గోవా తీరాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది వాయవ్య దిశగా కదులుతూ రెండు లేదా మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.