Peddireddy: కాంగ్రెస్లో చేరిన షర్మిల మాకు ప్రత్యర్థే : మంత్రి పెద్దిరెడ్డి
ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల(YS Sharmila) ఇవాళ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం తన పార్టీ వైఎస్టీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి షర్మిలకు కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీకి పోటీగా షర్మిల వచ్చే ఎన్నికల్లో పాల్గొననున్నారు. దీనిపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) స్పందించారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీ అయినా తమకు ఒక్కటేనని, షర్మిలను ప్రతిపక్ష నేతగానే చూస్తామని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఎంఎస్ బాబు ఆత్మ విమర్శ చేసుకోవాలి
కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అని, తామంతా సీఎం జగన్ కోసమే పనిచేస్తామని చెప్పారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ ఎన్ని పార్టీలు వచ్చినా, మళ్లీ జగన్ను సీఎం చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. మరోవైపు సీఎంపై పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు విమర్శలు చేయడాన్ని ఖండించారు. జడ్పీటీసీగా గెలవలేని ఎంఎస్ బాబును ఎమ్మెల్యేగా చేశామని, ఎవరో మాటలు విని ఎంఎస్ బాబు మాట్లాడడం బాధకరమని చెప్పారు. ఆయన ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.