అన్నదాతలను నేరస్తుల్లా చూడకండి: కేంద్రంపై ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె ఫైర్
MS Swaminathan's daughter: దిల్లీ సరిహద్దులో సమస్యలను పరిష్కరించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించడంతో దిల్లీ సరిహద్దు రణరంగంగా మారింది. అయితే దిల్లీ సరిహద్దులో రైతులపై పోలీసుల వ్యవహరిస్తున్న తీరును హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర ఖండించారు. రైతులను నేరస్తుల్లా చూడోద్దని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ను ఇటీవల కేంద్రం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎంఎస్ స్వామినాథన్ను దిల్లీలోని పూసాలో గల ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మధుర స్వామినాథన్ మాట్లాడారు.
రైతుల సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి: మధుర
పంజాబ్ రైతులు దిల్లీకి పాదయాత్రగా పోతుంటే, వారికి కోసం హర్యానాలో జైళ్లు సిద్ధం చేస్తున్నారని మధుర స్వామినాథన్ అన్నారు. వారిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వారు రైతులని, నేరస్థులు కాదని, ఆహార ప్రదాతలతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. వారిని నేరస్థులుగా చూడలేమన్నారు. దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలంతా రైతుల సమస్యకు పరిష్కారం కనుగొనాలని మధుర స్వామినాథన్ అన్నారు. ఇదిలా ఉంటే, సమస్యలపై చర్చించేందుకు రైతులను కేంద్ర ప్రభుత్వం చర్చలకు మరోసారి పిలిచింది. ప్రతిపక్షాల మాటలను నమ్మి తప్పటడుగులు వేయొద్దని రైతులకు కేంద్రం విజ్ఞప్తి చేసింది.