కనీస మద్ధతు ధరలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. క్వింటాల్ వరికి రూ.143 పెంపు
2023 -24 మార్కెటింగ్ సీజన్ ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ల పెంపుదలకు బుధవారం కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. భేటీలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ( ఎంఎస్పీ)ని పెంపుకు నిర్ణయించింది. అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యాలుగా ఎంఎస్పీని సమీక్షించినట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పియూశ్ గోయల్ తెలిపారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ సిఫారసుల ఆధారంగా వివిధ పంటల కనీస మద్ధతు ధరలను నిర్ణయిస్తామని వివరించారు.
గతంతో పోల్చితే ఈసారి అధిక మద్ధతు ధరలు
గతంలో పంటలకు ప్రకటించిన కనీస మద్ధతు ధరల పెంపుదలతో పోల్చితే ఈ సంవత్సరం పెరుగుదల అత్యధికంగా ఉందని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ వివరించారు. వరికి కనీస మద్ధతు ధర పెంపు : ఈ ఖరీఫ్ సీజన్ లో వరి పంటకు కనీస మద్ధతు ధర క్వింటాల్ కు రూ. 143 పెంచామని గోయల్ అన్నారు. తాజా పెంపుతో క్వింటాల్ వరి (కామన్ గ్రేడ్ వెరైటీ) ధర రూ. 2,183కి చేరుకుందన్నారు. గతేడాది ఇదే సీజన్ కు సంబంధించి పెంపుదలకు ముందు ధర రూ. 2,040గా ఉండేదని స్పష్టం చేశారు.
పెసర పంటకు 10 శాతం కనీస మద్ధతు ధర
ఏ గ్రేడ్ వెరైటీ వరి ఎంఎస్పీని క్వింటాల్ కు రూ. 163 పెంచామని గోయల్ చెప్పారు. ఫలితంగా ఏ గ్రేడ్ వరి ధర క్వింటాల్ కు ఎంఎస్పీ రూ. 2,203 కి చేరిందని, పెంపుదలకు ముందు ఇది రూ. 2060గా ఉండేదన్నారు. పెసర పంటకు అత్యధిక పెంపు : 2023 -24 మార్కెటింగ్ సీజన్ లో పెసర పంటకే అత్యధికంగా కనీస మద్దతు ధరను పెంచామన్నారు. పెసర పంట ఎంఎస్పీని ఒక క్వింటాల్ పై సుమారుగా 10.4 శాతం వరకు పెంచామన్నారు. తాజా పెంపుతో పెసర పంట క్వింటాల్ కనీస మద్దతు ధర రూ. 8,558కి చేరుకోవడం విశేషం. గత ఖరీఫ్ సీజన్ లో అది రూ. 7,755గా ఉండేదన్నారు.