ఉగ్రదాడిలో మరణించిన ఐదుగురు జవాన్ల పేర్లు వెల్లడి; రంగంలోకి ఎన్ఐఏ
ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు భారత ఆర్మీ జవాన్ల మృతి చెందడంపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందం శుక్రవారం జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాకు రానుంది. ఆర్మీ వాహనంపై గురువారం ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, మరొకరికి గాయాలయ్యాయి. దిల్లీ నుంచి ఎనిమిది మంది ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఎన్ఐఏ బృందం ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ఘటనాస్థలికి చేరుకుంటుంది. మరణించిన సైనికులను హవల్దార్ మన్దీప్ సింగ్, లాన్స్ నాయక్ దేబాశిష్ బస్వాల్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయి హరిక్రిషన్ సింగ్, సిపాయి సేవక్ సింగ్లుగా గుర్తించారు. ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే సైనికులకు నివాళులర్పించారు.
ఉగ్రవాదుల జాడ కోసం డ్రోన్లు, స్నిఫర్ డాగ్లను ఉపయోగిస్తున్న భద్రతా దళాలు
కాల్పుల్లో మరణించిన జవాన్లు రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్కు చెందినవారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం వారిని మోహరించారు. పూంచ్ సమీపంలోని బటా-డోరియా ప్రాంతంలో గల అడవుల్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల జాడ కోసం భద్రతా దళాలు డ్రోన్లు, స్నిఫర్ డాగ్లను ఉపయోగిస్తున్నాయి. ఆ ప్రాంతంలో భారీ వర్షం, సరిగా కనపడని పరిస్థితులను చూసుకొని ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారని నార్తర్న్ కమాండ్ తెలిపింది.