Page Loader
Republic Day: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో
రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో

Republic Day: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవా సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం అధికారికంగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, ఆయన రిపబ్లిక్ వేడుకలకు హాజరవుతారని తెలిపింది. ఇందులో భాగంగా ఇండోనేషియా అధ్యక్షుడు జనవరి 25, 26 తేదీల్లో భారతదేశాన్ని సందర్శించనున్నారు. 2024 అక్టోబరులో ఇండోనేషియా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ప్రభోవా సుబియాంటో భారతదేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంతో పాటు, ప్రాంతీయ, గ్లోబల్ సమస్యలపై చర్చించేందుకు అవకాశం కల్పిస్తుందని పేర్కొంది.

వివరాలు 

కరోనా కారణంగా గణతంత్ర వేడుకలకు అతిథులను ఆహ్వానించలేదు

2020లో ఇండోనేషియా రక్షణ మంత్రిగా ఆయన న్యూఢిల్లీని సందర్శించినట్లు వివరించింది. 1950 నుంచి భారతదేశం తన మిత్రదేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, 1952, 1953, 1966ల్లో మాత్రమే విదేశీ అతిథులు లేకుండా వేడుకలు నిర్వహించారు. 2024లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్, 2023లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎస్-సిసిలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. 2021, 2022ల్లో కరోనా కారణంగా గణతంత్ర వేడుకలకు అతిథులను ఆహ్వానించలేదు. 2020లో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, 2019లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

వివరాలు 

2018లో ఆసియా దేశాలకు చెందిన 10 మంది నాయకులు

2018లో ఆసియా దేశాలకు చెందిన 10 మంది నాయకులు వచ్చారు. 2017లో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 2016లో ఫ్రెంచ్ అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, 2015లో అమెరికా అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు. 2007లో రష్యా అధ్యక్షుడు పుతిన్, 2008లో ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.