
NIA: పాక్ గూఢచర్య నెట్వర్క్పై ఎన్ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ భద్రతకు ముప్పుగా మారే గూఢచర్య కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉక్కుపాదం మోసింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వారిపై ఎన్ఐఏ దేశవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.
మే 20న అరెస్టయిన ఓ నిందితుడి ఆధారంగా కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా, మొత్తం 15 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించింది.
ఈ సోదాలు దిల్లీ, ముంబయి, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్లోని అనేక ప్రాంతాల్లో జరిగాయి.
అనుమానితుల నివాసాలు, కార్యాలయాలను జాతీయ దర్యాప్తు బృందాలు ఖంగామీగా తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్థిక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Details
ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్న ఎన్ఐఏ
వీటిలో పాక్కు సంబంధించిన గూఢచర్య కార్యకలాపాలకు సంబంధించిన కీలక ఆధారాలు దొరికినట్లు సమాచారం.
2023 నుంచే ఓ వ్యక్తి పాక్కు సున్నితమైన సమాచారాన్ని పంపుతున్నట్లు గుర్తించి ఎన్ఐఏ అతడిని మే 20న అరెస్ట్ చేసింది. అతడికి దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి నిధులు చేరినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా పలువురిని అధికారులు విచారిస్తున్నారు.
తాజాగా కాసిం అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా, అతడు పాక్కు కీలక సమాచారాన్ని చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని, పాకిస్థాన్ నిఘా వ్యవస్థకు చెందిన గూఢచర్య నెట్వర్క్ను ఛేదించేందుకు ఎన్ఐఏ ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తోంది.
దొరికిన ఆధారాల ఆధారంగా మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.