లోక్సభలో ద్రౌపది అంశంపై దుమారం.. అసెంబ్లీలో జయలలిత చీర లాగారని నిర్మలా కౌంటర్
మూడో రోజూ అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్సభ వేదికగా అధికార పక్షం, విపక్షాలే లక్ష్యంగా మాటల తుటాలు వదిలారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు.1989లో తమిళ శాసనసభలో జయలలితకు జరిగిన ఘోర అవమానాన్ని గుర్తు చేస్తూ విపక్షాలపై మండిపడ్డారు. మాజీ సీఎం జయలలిత చీరను లాగి దారుణంగా అవమానపర్చారన్నారు. మహాభారతం చదివిన వారికి ఓ విషయం అర్థమవుతుందని, డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు. కానీ ద్రౌపది అంశంలో చివరికి నేరస్తులకే శిక్ష పడిందన్నారు. అలాగే మౌనంగా ఉన్నవారికీ శిక్ష పడిందని చెప్పుకొచ్చారు. హత్రాస్,కథువా, ఉన్నావ్, బిల్కిస్ బానో, రెజర్ల ధర్నాలపై కేంద్రం మౌనం వహించిందని, ఈ మేరకు శిక్షించబడతారని జోస్యం చెప్పారు.
జయలలితను డీఎంకే మరచిపోయిందా : నిర్మలా సీతారామన్
1989 మార్చిలో తమిళనాడు శాసనసభలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేయాదల్చుకుంటున్నాను అని నిర్మలా సీతారామన్ సభలో అన్నారు. జయలలిత ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆమె చీరను లాగేశారని గుర్తు చేశారు. పవిత్ర సభలో చీర లాగినప్పుడు అధికార డీఎంకే సభ్యులు విద్రోహ చర్యను సమస్తూ ఆమెను చూసి హేళన చేశారని పేర్కొన్నారు. జయలలితను డీఎంకే మరచిపోయిందా అని ప్రశ్నించారు. ఆ రోజు జయలలిత ముఖ్యమంత్రి అయ్యే వరకు సభకు రానని భీష్మించారు. రెండేళ్లు గడిచాక తమిళనాడు ముఖ్యమంత్రిగా తిరిగొచ్చారు. సభలో మహిళ చీరను లాగిన వారు ఇవాళ ద్రౌపది గురించి మాట్లాడుతున్నారని నిలదీశారు.