Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచిన అధికారులు.. దిగువ ప్రాంతాలకు వరద నీరు!
ఈ వార్తాకథనం ఏంటి
మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరుతోంది. పెరుగుతున్న నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని జలవనరుల శాఖ అధికారులు ఆదివారం ఉదయం ప్రకాశం బ్యారేజీ నాలుగు గేట్లను అడుగుమేర ఎత్తి 2,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అదే సమయంలో బందరు, రైవస్ కాలువలకు కలిపి 2,11 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రివర్ కన్సర్వేటర్ ఆర్. రవికిరణ్ వివరాలు వెల్లడించారు.
వివరాలు
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇసుక రీచ్ల వద్ద పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహం, అలాగే కృష్ణా డెల్టా కాలువలకు అవసరమయ్యే నీటి వినియోగాన్ని బట్టి విడుదల చేసే నీటి పరిమాణంలో మార్పులు ఉండొచ్చని తెలిపారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి కృష్ణా డెల్టాకు జులై 1వ తేదీ నుంచి సాగునీరు అందించే అవకాశం ఉందని రవికిరణ్ వెల్లడించారు. మరోవైపు కృష్ణా నదికి రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు వరద ప్రవాహం కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.