రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు; పార్కుల మూసివేత
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు గురువారం ముగియనున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాల ముగింపులో భాగంగా హైదరాబాద్లోని సచివాలయం ఎదురుగా, హుస్సేన్ సాగర్ సమీపంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ సమీపంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. అలాగే హుస్సేన్ సాగర్ దగర్లో ఉన్న అన్ని పార్కులను గురువారం మూసివేయనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) తెలిపింది. ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్లోకి సందర్శకులకు అనుమతి లేదని సందర్శకులు ఈ మేరకు గమనించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే సచివాలయ ఉద్యోగులకు కూాడా సెలవు ప్రకటించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.