LOADING...
Operation Nagni TOP: కుప్వారాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్నిఛేదించిన భారత సైన్యం.. భారీగా ఆయుధాలు స్వాధీనం 
కుప్వారాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్నిఛేదించిన భారత సైన్యం.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Operation Nagni TOP: కుప్వారాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్నిఛేదించిన భారత సైన్యం.. భారీగా ఆయుధాలు స్వాధీనం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి. తాజాగా కుప్వారా జిల్లాలోని ఒక ప్రాంతంలో ఉగ్రవాదులకి చెందిన శిబిరాన్ని గుర్తించి,అక్కడ నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు 'నాగ్ని టాప్‌' అనే పేరును భద్రతా దళాలు పెట్టాయి. ఖచ్చితమైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, భారత సైన్యం, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను అమలు చేశాయి. ఈ వివరాలను చినార్‌ కోర్‌ అధికారిక 'ఎక్స్‌' ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు ఒక తుపాకీ, 12 గ్రనేడ్లు, రెండు మ్యాగజైన్‌లు, అలాగే ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇది ప్రాంతంలోని ఉగ్రవాద కార్యకలాపాలకు గట్టి దెబ్బ అని అధికారులు భావిస్తున్నారు.

వివరాలు 

ఐదవ రోజుకు చేరిన ఆపరేషన్‌

ఇదిలా ఉంటే,ఇప్పటికే కుల్గాం జిల్లాలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న సుదీర్ఘ ఆపరేషన్‌ 'అఖాల్‌'లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. నేటితో ఐదవ రోజుకు చేరిన ఈ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక'ఆపరేషన్‌ మహాదేవ్‌'లో భాగంగా పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి బాధ్యులైన ముఠాను భద్రతా బలగాలు మట్టుబెట్టిన కొన్ని రోజులకే,ఈ తాజా ఆపరేషన్లు ప్రారంభమైన సంగతి గమనార్హం. అలాగే జూలై 30న నిర్వహించిన'ఆపరేషన్‌ శివశక్తి'లోఇద్దరు చొరబాటుదారులను భద్రతా బలగాలు హతమయ్యారు. ఇంతకీ,జమ్మూ కశ్మీర్‌ నుంచి ఆర్టికల్‌ 370 రద్దు చేసి ఆరేళ్లు పూర్తవుతున్న వేళ,ఇంత భారీ ఆయుధ నిల్వ బయటపడటం ప్రాధాన్యత కలిగిన అంశంగా అధికారులు పేర్కొంటున్నారు. ఇది ఉగ్రవాద నిర్మూలనలో కీలకమైన పురోగతిగా భావిస్తున్నారు.