
INDIA: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పై చర్చలో పాల్గొంటాం.. కానీ! 'ఇండియా' కూటమి కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు (Waqf Bill)ను బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో, 'ఇండియా' కూటమికి చెందిన ప్రతిపక్ష పార్టీలు కీలక సమావేశాన్ని నిర్వహించాయి.
ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సమాచారం.
ఈ సమావేశం సాయంత్రం ఢిల్లీలో జరిగింది, ఇందులో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), సీపీఎం సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.
లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడంతో పాటు, ఈ బిల్లుపై చర్చలో క్రియాశీలంగా పాల్గొనాలని కానీ, చివరికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ భేటీ అనంతరం, లోక్సభలో ప్రతిపక్షాలు చర్చలో పాల్గొంటాయని, అయితే బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయనున్నట్లు శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది తెలిపారు.
వివరాలు
ప్రతిపక్ష ఐక్యత
వక్ఫ్ (సవరణ)బిల్లుపై మోదీ సర్కార్ రాజ్యాంగ విరుద్ధమైన విధానాన్ని అనుసరిస్తోందని,విభజనశీల అజెండాను ఓడించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా పనిచేస్తాయని ఆయన 'ఎక్స్'లో పోస్టు చేశారు.
భద్రతా ఏర్పాట్లు
ఇక కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. వచ్చే మూడు రోజులు సభకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.
వక్ఫ్(సవరణ)బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
అసాంఘిక శక్తుల వల్ల శాంతిభద్రతలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు పలు సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
శాంతి భద్రతలను కాపాడేందుకు రాత్రి గస్తీని పెంచారు. అదనపు భద్రతా బలగాలను మోహరించారు.