Page Loader
Andhrapradesh: లిక్కర్ స్కాం కేసులో కొత్త మలుపు.. మరో ఇద్దరినీ అరెస్ట్ చేసిన సిట్
లిక్కర్ స్కాం కేసులో కొత్త మలుపు.. మరో ఇద్దరినీ అరెస్ట్ చేసిన సిట్

Andhrapradesh: లిక్కర్ స్కాం కేసులో కొత్త మలుపు.. మరో ఇద్దరినీ అరెస్ట్ చేసిన సిట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2025
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తున్న లిక్కర్ స్కాం కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచింది. ఇటీవలే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని విచారించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భాస్కర్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు (పీఏలు) అయిన బాలాజీ, నవీన్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు,ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి భారీగా నగదు తరలించారన్న ఆరోపణలతో బాలాజీపై దృష్టి సారించారు. పోలీసుల అనుమానాల ప్రకారం బాలాజీ ఎన్నికల సమయంలో రూ.8 కోట్ల 20 లక్షల రూపాయలను తరలించినట్లు సమాచారం. లిక్కర్ కేసులో బాలాజీ ఏ35, నవీన్ ఏ36 ఉన్నారు.

వివరాలు 

లిక్కర్ స్కాం కేసులో 11కి చేరిన అరెస్టులు 

ఈ స్కాంలో డబ్బులు చలామణి చేసిన విషయంపై తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం కుంభకోణం కేసులో తమపై కేసులు నమోదయ్యాయని తెలుసుకున్న తర్వాత భయంతో బాలాజీ, నవీన్‌లు ఇండోర్‌కు పారిపోయినట్లు సమాచారం. వారిని పట్టుకోవడానికి సిట్ బృందం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా, ఇండోర్ నుంచి వైసీపీ నేతలకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు అనే ఆధారాలతో వారి లొకేషన్‌ను ట్రేస్ చేసిన సిట్ అధికారులు అక్కడకు చేరుకొని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులతో లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య మొత్తంగా 11కి చేరింది. దీనితోపాటు స్కాంలో మరిన్ని వివరాలు వెలుగు చూడనున్నాయనే అంచనాలు నెలకొన్నాయి.