Parliament Winter Session 2023: లోక్సభ నుంచి 14 మంది విపక్ష ఎంపీల సస్పెండ్
14 మంది ఎంపీలు "దారుణప్రవర్తన" కారణంగా లోక్సభ నుండి సస్పెండ్ అయ్యారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గాను స్పీకర్ ఓం బిర్లా మొదట ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేస్తూ గురువారం లోక్సభ తీర్మానాన్ని ఆమోదించినట్లు పిటిఐ నివేదించింది. మొదట సస్పన్షన్కు గురైన వారిలో కాంగ్రెస్ కి చెందిన టీఎన్ ప్రతాపన్,హిబీ ఈడెన్,ఎస్ జోతిమణి,రమ్య హరిదాస్,డీన్ కురియకోస్ సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్లో బుధవారం భద్రతా వైఫల్యంతో ఇద్దరు ఆగంతుకులు(సాగర్ శర్మ,మనోరంజన్) లోక్సభ పబ్లిక్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి గందరగోళం చేసిన ఘటనపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు గురువారం ఆందోళన చేపట్టాయి.
భద్రతా వైఫల్యంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు పట్టు
ఈ ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే భద్రతా వైఫల్యంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. విపక్ష సభ్యులు చేపట్టిన నిరసనలు, నినాదాల మధ్య పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఎంపీల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ఆమోదం పొందిన అనంతరం స్పీకర్ సభను మధ్యాహ్నాం 3 గంటల వరకు వాయిదా వేశారు. 3 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు మళ్ళీ ఆందోళన ప్రారంభించడంతో బెన్నీ బెహనన్, వీకే శ్రీకందన్, మహమ్మద్ జావెద్,పీఆర్ నటరాజన్, కనిమొళి,కె.సుబ్రహ్మణ్యం,ఎస్ఆర్ పార్థిబన్,ఎస్ వెంకటేశన్, మాణికం ఠాగూర్ను సస్పెండ్ చేస్తూ సభలో ప్రహ్లాద్ జోషీ మరోసారి తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం రేపు ఉదయానికి లోక్సభ వాయిదా పడింది.