జూన్ 14న అన్నవరం దర్శనంతో వారాహి యాత్ర ప్రారంభం
ఏపీలో వారాహి పొలిటికల్ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. భేటీలో భాగంగా పవన్ కల్యాణ్ పర్యటనపై చర్చలు సాగించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన నాదెండ్ల జూన్ 14 నుంచి జనసేన అధినేత పవన్ వారాహి వాహనం ఆంధ్ర రోడ్లు ఎక్కనున్నందన్నారు. ఇందుకోసం జనసేనాని యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను ఖరారు చేసినట్లు వెల్లడించారు. గోదావరి జిల్లాల్లో టూర్ లో భాగంగా తొలి విడతగా తూర్పుగోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఉంటుందన్నారు. అన్నవరం క్షేత్రంలో ప్రత్యేక పూజల అనంతరం వారాహి యాత్ర ప్రారంభమవుతుందని కమిటీ ఛైర్మన్ స్పష్టం చేశారు.
వైసీపీ ముక్త్ ఆంధ్రప్రదేశే లక్ష్యంగా వారాహి
అన్నవరం నుంచి భీమవరం వరకు ప్రారంభ యాత్ర సాగుతుందన్నారు. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం తదితర నియోజకవర్గాల్లో అధినేత తొలివిడత యాత్ర నిర్వహిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. యాత్రలో భాగంగా అన్ని వర్గాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో అందరినీ కలుపుతూ ముందుకు సాగుతామన్నారు. ప్రజలకు భరోసా కల్పించేలా జనసేన యాత్ర ఉంటుందని, యాత్రతో క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే తాము కృషిచేస్తున్నట్టు వివరించారు. వైసీపీ ముక్త్ ఆంధ్రప్రదేశే లక్ష్యంగా కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన దొహదపడుతుందన్నారు. ఈ మేరకు రైతులు, మహిళలకు బాసటగా నిలవడానికి పవన్ నడం బిగించనున్నట్లు తెలిపారు.