
Ambati Rambabu: వైసీపీ నేత,మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా, కొర్రపాడు వద్ద అంబటి తన సోదరుడు మురళితో కలిసి బారికేడ్లను తోసేసి, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వారిని అడ్డుకున్న పోలీసులను కూడా ఆయన నెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై "విధుల్లో ఆటంకం కలిగిస్తూ, అధికారులపై దాడికి దిగారు" అనే ఆరోపణలతో అంబటిపై పోలీసు కేసు నమోదైంది.
వివరాలు
పోలీసులు చెక్పోస్ట్ ఏర్పాటు
బుధవారం నాడు జగన్, సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్ల గ్రామంలో నిర్వహించిన వైకాపా కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ర్యాలీ గుంటూరు, నల్లపాడు, మేడికొండూరు మార్గాల మీదుగా పల్నాడు జిల్లా వరకు సాగింది.
గుంటూరు,పల్నాడు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన కొర్రపాడు శివారులో ఉన్న ఓ పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు.
జగన్ ప్రయాణిస్తున్న వాహనం ముందుగా వెళ్లిపోగా,వెనుక ఉన్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు వాటిని ఆపారు.
అదే సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడికి చేరుకుని, వాహనాలను ఎందుకు ఆపుతున్నారని పోలీసులను ప్రశ్నిస్తూ వెంటనే వాటిని వెళ్లనివ్వాలంటూ వాదనకు దిగారు.
వివరాలు
అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై మాటల దాడి
పోలీసులు స్పందిస్తూ, వాహనాల సంఖ్య అధికంగా ఉండటంతో పాటు, ఏటుకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనను దృష్టిలో పెట్టుకుని, జగన్ కాన్వాయ్కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వాహనాలను నిలిపామని వివరించారు.
అయితే అంబటి రాంబాబు ఈ వివరణను వినిపించుకోకుండా, పోలీసులతో మాటల యుద్ధానికి దిగారు.
ఈ క్రమంలో, ఒక దశలో ఆయన తన సోదరుడు మురళితో కలిసి రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను బలవంతంగా పక్కకు తొక్కేశారు.
అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై మాటల దాడి చేస్తూ, వారిపై దూసుకెళ్లినట్లు ప్రత్యక్షసాక్షుల చెబుతున్నారు.