Page Loader
Hyderabad: అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కలకలం.. అమిత్‌ కుమార్‌ గ్యాంగ్‌ కోసం పోలీసుల ముమ్మర వేట 
అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కలకలం.. అమిత్‌ కుమార్‌ గ్యాంగ్‌ కోసం పోలీసుల ముమ్మర వేట

Hyderabad: అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కలకలం.. అమిత్‌ కుమార్‌ గ్యాంగ్‌ కోసం పోలీసుల ముమ్మర వేట 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2025
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

కలకలం రేపిన హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, హైదరాబాద్‌తో పాటు రాయ్‌పుర్‌, బిహార్‌, అనుమానిత ప్రాంతాల్లో గాలింపు కొనసాగిస్తున్నారు. కాల్పులు జరిపిన ముఠా బిహార్‌కు చెందిన అమిత్‌ కుమార్‌ నాయకత్వంలోని గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. బీదర్‌లో దోపిడీకి పాల్పడి, అక్కడ ఇద్దరిపై కాల్పులు జరిపి, నగరంలోకి ప్రవేశించి రాయ్‌పుర్‌ మీదుగా పారిపోయే ప్రయత్నం చేసినట్టు పోలీసులు గుర్తించారు. దొంగలు హైదరాబాద్‌ ఎలా చేరుకున్నారనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు.

వివరాలు 

అమిత్‌ కుమార్‌ కీలకపాత్ర

ముఠా బిహార్‌ నుంచి పారిపోయిందా అన్న కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. ఈ ముఠాలో ప్రధానంగా అమిత్‌ కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతనిపై బిహార్‌లో దోపిడీ, దొంగతనం వంటి పలు కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌, శాంతి భద్రతల విభాగం పోలీసులు నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. బిహార్‌ పోలీసులతో సంప్రదించిన నగర పోలీసు ఉన్నతాధికారులు అమిత్‌ కుమార్‌ నేరాల చిట్టా గురించి ఇప్పటికే తెలుసుకున్నట్టు సమాచారం.

వివరాలు 

బీభత్సం సృష్టించిన అమిత్‌ గ్యాంగ్‌

అమిత్‌ గ్యాంగ్‌ కర్ణాటకలోని బీదర్‌, ఆ తర్వాత హైదరాబాద్‌లో కాల్పులతో బీభత్సం సృష్టించింది. బీదర్‌లో ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి, నగదుతో ద్విచక్ర వాహనంపై పారిపోయి హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. అఫ్జల్‌గంజ్‌ నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌ ద్వారా రాయ్‌పుర్‌ వెళ్ళేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ట్రావెల్స్‌ సిబ్బంది వారి బ్యాగులను తనిఖీ చేయడంతో, కట్టల దగ్గర డబ్బులను గమనించి అనుమానంతో ప్రశ్నించారు. ఈ సమయంలో నిందితులు ఒకరిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు.

వివరాలు 

హైదరాబాద్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరికి గాయాలు 

బీదర్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సినీఫక్కీలో చోటుచేసుకున్న ఈ ఘటనలతో స్థానికులు తీవ్రంగానే ఉద్విగ్నమయ్యారు. రెండు చోట్ల కూడా అత్యంత రద్దీ ప్రాంతాలలో ఆగంతుకులు ఇంతటి తెగింపు ప్రదర్శించడం గమనార్హం.