Page Loader
Lookout Notice: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు వేట.. లుకౌట్‌ నోటీసులు జారీ
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు వేట.. లుకౌట్‌ నోటీసులు జారీ

Lookout Notice: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు వేట.. లుకౌట్‌ నోటీసులు జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2025
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్సార్ కాంగ్రెస్ నేత,మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులను జారీ చేశారు. ఆయన దేశాన్ని విడిచిపెట్టకుండా అడ్డుకునేందుకు ఈ చర్య చేపట్టారు.ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలు,నౌకాశ్రయాలకు సమాచారం పంపారు. ఇంతకుముందు కాకాణి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, పోలీసులు ఇప్పటికే మూడు సార్లు నోటీసులు పంపినప్పటికీ ఆయన విచారణకు హాజరుకాలేదు. ప్రస్తుతం కాకాణి సహా మరో నలుగురు నిందితులు గత 12 రోజులుగా గల్లంతయ్యారు. వారిని పట్టుకునేందుకు ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో ఆరుగురు ప్రత్యేక పోలీస్‌ బృందాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

వివరాలు 

విదేశాలకు క్వార్ట్జ్‌ ఎగుమతి ఆరోపణలు 

క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు,భారీ స్థాయిలో పేలుడు పదార్థాల వినియోగంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కాకాణిపై క్వార్ట్జ్‌ అక్రమ రవాణా, అట్రాసిటీ, పోలీసులను దూషించిన కేసులు నమోదు అయ్యాయి. ఆయన తన అనుచరులతో కలిసి రూ.250 కోట్లకు పైగా విలువ చేసే క్వార్ట్జ్‌ను విదేశాలకు ఎగుమతి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో విదేశాల నుంచి భారీ మొత్తాల్లో నగదు బదిలీ జరగడంపై పోలీసులు పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. పేలుడు పదార్థాలను సరఫరా చేసిన కంపెనీలు, వాటిని కొనుగోలు చేసిన వ్యక్తులు, వాటి వినియోగ పద్ధతులపై విచారణ కొనసాగుతోంది.