Prajavani : ప్రజాభవన్కు పోటెత్తిన ప్రజలు.. కిలోమీటర్ల మేర క్యూ.. భారీగా ట్రాఫిక్ జామ్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 'ప్రగతి భవన్' పేరు మార్చి 'ప్రజా భవన్' గా మార్చిన విషయం తెలిసిందే. ఈ ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి శుక్రవారం వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. ప్రజా భవన్ నుంచి పంజాగుట్ట చౌరస్తా వరకు క్యూలైన్లో ప్రజలు వేచియున్నారు. దీంతో జనం రోడ్లపై నిల్చుకోవడంతో ట్రాఫిక్ సమస్య అయ్యింది. కొందరు రాత్రి నుంచే ఎదురుచూస్తున్నట్లు తెలిసింది.
మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి
స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో సమస్యలు చెప్పుకునేందుకు జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి జరగనుంది. వేలాది ఫిర్యాదుదారులతో ప్రజావాణి కిటకిటలాడింది. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి జరగనుంది. ఉదయం 10 గంటల వరకు లైన్లో ఉన్నవారికి మాత్రమే అనుమతిస్తారు. దివ్యాంగులకు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.