ముఖ్యమంత్రి రేసులో ప్రతిమా భౌమిక్; అదే జరిగితే మొదటి మహిళా సీఎంగా రికార్డు
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరనేది తీవ్రమైన చర్చనడుస్తోంది. త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రాజీనామా చేసిన తర్వాత, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి సమాచారం లేదు. దీంతో కొత్త ముంఖ్యమంత్రిపై ఊహాగానాలు పెరిగాయి. ఈ రేసులో ప్రధానంగా కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ పేరు బలంగా వినిపిస్తోంది. బీజేపీ అధిష్ఠానం ప్రతిమా భౌమిక్ వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిమా భౌమిక్ పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అభిప్రాయానికే అధిష్ఠానం మొగ్గు
ప్రతిమా భౌమిక్ ముఖ్యమంత్రి అయితే.. త్రిపురతో పాటు అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టిస్తారు. అయితే రాష్ట్రంలో పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు రెఫరెండం నిర్వహించాలని రాష్ట్ర బృందం హైకమాండ్ను కోరినట్లు సమాచారం. సీఎం రేసులో ఎంత మంది ఉన్నా.. పార్టీ నార్త్-ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్ఈడీఏ) కన్వీనర్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అభిప్రాయానికే అధిష్ఠానం మొగ్గు చూపుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. 'భౌమిక్ను ముఖ్యమంత్రి చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని చెప్పుకొచ్చారు.