LK advani: ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రధానం .. ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి, ప్రధాని
సీనియర్ బిజెపి నాయకుడు లాల్ కృష్ణ అద్వానీకి ఈ రోజు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరుకాలేకపోయారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. నిన్న(శనివారం) రాష్ట్రపతి భవన్లో జరిగిన భారతరత్న అవార్డు ప్రదానోత్సవంలో కర్పూరి ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్, చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావులను భారతరత్నతో సత్కరించారు.
అద్వానీ జీవితం స్ఫూర్తిదాయకం: మోదీ
అయితే, ఇంతకు ముందు కూడా అద్వానీ తన కృషికి గానూ 2015లో దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో సత్కరించారు. ఆ సమయంలో అద్వానీకి 90 ఏళ్లు,అనారోగ్యం కారణంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి సన్మానించారు. 96 ఏళ్ల లాల్ కృష్ణ అద్వానీ జీవితం స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ అన్నారు. అట్టడుగు స్థాయిలో పని చేయడం నుండి మన ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం వరకు అయన జీవితం ఆదర్శమన్నారు. అద్వానీ హోం మంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా తనదైన ముద్ర వేశారు.బీజేపీ పార్టీ స్థాపనలో అటల్ బిహారీ వాజ్పేయితో పాటు లాల్ కృష్ణ అద్వానీ కూడా కీలక పాత్ర పోషించారు.
2014లో గాంధీనగర్ నుంచి చివరిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ
అద్వానీ 1970లో దిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. 1977 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత అద్వానీకి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించగా, 1999 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత హోం శాఖ బాధ్యతలు అప్పగించారు. 2002 నుంచి 2005 వరకు ఉప ప్రధానిగా కూడా కొనసాగారు. అద్వానీ 1991, 1998, 1999, 2004, 2009లో గాంధీనగర్ నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో గాంధీనగర్ నుంచి చివరిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.