తెలంగాణకు 9ఏళ్లలో రూ.లక్ష కోట్ల నిధులిచ్చాం.. రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలి: ప్రధాని మోదీ
మహబూబ్నగర్లో ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. రూ.13,500 కోట్ల విలువైన పనులను ప్రారంభించిన తర్వాత మోదీ ప్రజాగర్జన వేదిక వద్దకు వచ్చి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు మోదీ పేర్కొన్నారు. తెలంగాణ అవినీతి రహిత పాలన కావాలన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో బీజేపీని ప్రజలు బలోపేతం చేసినట్లు మోదీ వివరించారు. తెలంగాణకు కావాల్సింది అస్యత్యాలు చెప్పేవాళ్లు కాదని, క్షేత్రస్థాయిలో పనులు చేసేవాళ్లు కావాలని మోదీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రైతు పథకాల పేరుతో తెలంగాణ సర్కార్ దోచుకుంటోంది: మోదీ
తెలంగాణకు గత 9 ఏళ్లలో లక్ష కోట్ల నిధులిచ్చామని మోదీ ప్రకటించారు. వాస్తవానికి తెలంగాణలో తమ సర్కార్ లేకపోయినా.. ఈ రాష్ట్రంలోని రైతులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు పథకాల పేరుతో ప్రజలను దోచుకుంటోందన్నారు. సాగునీటి కాలువల పేరుతో గొప్పలకు పోతోందని దుయ్యబట్టారు. ఒకరకంగా చెప్పాలంటే, ఇక్కడి ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందన్నారు. తమ ప్రభుత్వం రైతును ప్రత్యేకంగా గౌరవిస్తుదని మోదీ అన్నారు. రైతుల కష్టానికి తాము తగిన ప్రతిఫలం అందిస్తున్నట్లు చెప్పారు. కేవలం రైతుల కోసం తమ ప్రభుత్వం రామగుండ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని తెరిపించినట్లు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్లు మోదీ ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటుతో ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ సర్కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో: మోదీ
ఎంఐఎం పార్టీపై కూడా ప్రధాని మోదీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ సర్కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని మోదీ ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు అవినీతి, కమీషన్లతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్నాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్- మజ్లీస్ పార్టీలు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు మారి ప్రభుత్వాన్ని నడుపున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే, కాంగ్రెస్, బీఆర్ఎస్కు నిద్రపట్టదని మోదీ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 2014కు ముందు కేవలం 2500 కి.మీ జాతీయ రహదారులు మాత్రమే ఉండేవన్నారు. తమ ప్రభుత్వం కేవలం తొమ్మిదేళ్ల పాలనలో 2500 కి.మీల జాతీయ రహదారులు నిర్మించామని మోదీ అన్నారు.