Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు.. కేంద్రం తరఫున అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు.
ఈ సందర్భంగా, నోయెల్ టాటాతో ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు. భారత ప్రభుత్వం తరఫున రతన్ టాటా అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని మోదీ నోయెల్కు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో, అమిత్ షా పర్యవేక్షిస్తారని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
ముంబయిలోని ఆసుపత్రిలో బుధవారం రాత్రి రతన్ టాటా కన్నుమూసిన సంగతి తెలిసిందే.
వివరాలు
మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర
రతన్ టాటా పార్థీవదేహాన్ని కోల్బాలోని నివాసానికి తరలించారు. ఆయన పార్థివ దేహానికి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ నివాళులర్పించారు.
ఉదయం 10.30 గంటలకు ముంబయి ఎన్సీపీఏ గ్రౌండ్లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది.
అధికారిక లాంఛనాలతో సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. నేడు సంతాప దినంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
"నైతికత, వ్యవస్థాపకత ఆదర్శ సమ్మేళనం రతన్ టాటా. భారతదేశం పారిశ్రామికంగా వృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించారు'' అని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే పోస్టు పెట్టారు.