Page Loader
Sambhal violence : సంభాల్‌లో అల్లర్లు.. నలుగురు మృతి.. వందలాదిమందిపై కేసు నమోదు
సంభాల్‌లో అల్లర్లు.. నలుగురు మృతి.. వందలాదిమందిపై కేసు నమోదు

Sambhal violence : సంభాల్‌లో అల్లర్లు.. నలుగురు మృతి.. వందలాదిమందిపై కేసు నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 25, 2024
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న హింసాకాండపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మొత్తం ఏడు కేసుల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్, ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్‌తోపాటు వందల మంది నిందితులుగా చేర్చారు. ఘటనా స్థలంలో ప్రజలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించినట్లు జిల్లా కలెక్టర్‌ రాజేంద్ర పెన్సియా, సంభాల్ ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్ ఆరోపించారు. బార్క్, సోహైల్‌తో సహా మరో ఆరుగురిపై కేసులు నమోదయ్యాయని, నిందితులను గుర్తించేందుకు వీడియో ఫుటేజ్‌ను ఉపయోగిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని వివరించారు.

Details

20మంది పోలీసులకు గాయాలు

మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు స్థలంలో గతంలో ఆలయం కూల్చివేసి మసీదు నిర్మించారని ఆరోపిస్తూ ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు మసీదు స్థలంలో సర్వే ప్రారంభమైంది. గత మంగళవారం మొదలైన సర్వే కారణంగా అప్పటినుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో సర్వే బృందం మసీదు వద్దకు చేరుకోగా, వేలాది మంది స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు రాళ్లు రువ్వడంతో పాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందగా, 20 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. వివాదం నేపథ్యంలో సంభాల్‌లో పోలీసులు భారీగా మోహరించారు.