Rahul Gandhi: 'రాజ్యాంగంపై దాడి చేయలేరని ఆర్ఎస్ఎస్కు అర్థమయ్యేలా చెప్పాలి': కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) రూపొందించిన తాజా ముసాయిదా నిబంధనలను బీజేపీయేతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో, డీఎంకే విద్యార్థి విభాగం గురువారం నాడు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగింది.
ఈ నిరసన కార్యక్రమంలో డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు.
వివరాలు
యూజీసీ ముసాయిదా ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నాం: అఖిలేష్
"ఈ యూజీసీ ముసాయిదా కేవలం విద్యాపరమైన చర్య మాత్రమే కాదు. ఇది మన దేశ చరిత్ర, సంప్రదాయాలు,సంస్కృతి,భాషలపై దాడి చేయడానికి ఆరెస్సెస్ చేస్తున్న ప్రయత్నం.ఇదే విషయాన్ని నేను చాలా కాలంగా చెబుతున్నాను.దేశవ్యాప్తంగా ఒకే చరిత్ర,ఒకే సంప్రదాయం,ఒకే భాషను తేవాలనే ఆలోచనతోనే రాజ్యాంగంపై దాడి జరుగుతోంది.వివిధ రాష్ట్రాల విద్యా వ్యవస్థలను నియంత్రించేందుకు వారు చేస్తున్న ఈ ప్రయత్నం,వారి ఎజెండాను అమలు చేసేందుకు ఉద్దేశించినదే" అని రాహుల్ గాంధీ విమర్శించారు.
యూజీసీ ముసాయిదా ప్రతిపాదనలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అఖిలేశ్ యాదవ్ తెలిపారు.
ఈ కొత్త విధానం విశ్వవిద్యాలయాలను పారిశ్రామికవేత్తలకు అప్పగించే కుట్రగా అభివర్ణిస్తూ, తాము దీనికి ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు.
వివరాలు
కొత్త ముసాయిదా ప్రకారం ఈ అధికారం గవర్నర్ల చేతుల్లోకి..
యూనివర్శిటీల్లో, కళాశాలల్లో అధ్యాపకులు, బోధనా సిబ్బంది నియామకం, పదోన్నతుల కనీస అర్హతలు, అలాగే ఉన్నత విద్య ప్రమాణాలను నిర్వహించే మార్గదర్శకాలు-2025 పేరుతో యూజీసీ ఇటీవల ఓ ముసాయిదాను విడుదల చేసింది.
అయితే, ఇందులోని అనేక ప్రతిపాదనలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
ఇప్పటివరకు విశ్వవిద్యాలయాల అధిపతులైన వైస్ ఛాన్సలర్ల నియామక హక్కు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండేది.
కానీ, కొత్త ముసాయిదా ప్రకారం ఈ అధికారం గవర్నర్ల చేతుల్లోకి వెళ్తుంది.
ఈ మార్పును భాజపాయేతర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తూ చట్టసభల్లో తీర్మానం కూడా చేశాయి.