Page Loader
Saudi Arabia:భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల వేళ.. హఠాత్తుగా న్యూదిల్లీకి సౌదీ విదేశాంగ మంత్రి 
భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల వేళ.. హఠాత్తుగా న్యూదిల్లీకి సౌదీ విదేశాంగ మంత్రి

Saudi Arabia:భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల వేళ.. హఠాత్తుగా న్యూదిల్లీకి సౌదీ విదేశాంగ మంత్రి 

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2025
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో, సౌదీ అరేబియా నుంచి ఒక జూనియర్‌ మంత్రి అకస్మాత్తుగా న్యూఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. సౌదీ విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన జూనియర్‌ మంత్రి అదెల్‌ అల్‌ జుబైర్‌ ఈ రోజు భారత రాజధాని దిల్లీకి వచ్చారు. ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో సమావేశమై ద్వైపాక్షికంగా చర్చలు నిర్వహించారు. ఈ పర్యటన,భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చేపట్టిన ప్రయత్నాల్లో భాగంగా జరిగినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఎక్స్‌ వేదికగా ఓ సందేశాన్ని పంచుకున్నారు. ''సౌదీ మంత్రి అదెల్‌ అల్‌ జుబైర్‌తో మంచి సమావేశం జరిగింది.ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత్‌ తీసుకుంటున్న కఠినమైన వైఖరిని ఆయనకు వివరించాను,''అని పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎస్‌. జైశంకర్‌ చేసిన ట్వీట్ 

వివరాలు 

సయ్యద్‌ అబ్బాస్‌ అరాగ్ఛితో కూడా భేటీ 

ఇటీవల చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో భారత్‌-పాక్‌ సంబంధాలు యుద్ధ వాతావరణాన్ని తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను శాంతిపరంగా పరిష్కరించేందుకు సాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా, సౌదీ మంత్రి పర్యటన ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా,భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఇరాన్‌ విదేశాంగ వ్యవహారాల ఉపమంత్రిగా ఉన్న సయ్యద్‌ అబ్బాస్‌ అరాగ్ఛితో కూడా సమావేశమయ్యారు. ఇరాన్‌ ఇప్పటికే భారత్‌, పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది.

వివరాలు 

అధికారిక ప్రకటన లేకుండానే పాకిస్థాన్‌ వెళ్లిన అరాగ్ఛి

ఇటీవల అరాగ్ఛి తన సోషల్‌ మీడియా ఖాతాలో, ''మనకు సోదరులాంటి పొరుగుదేశాలు అత్యంత ప్రాధాన్యం కలిగినవే'' అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక, భారత్‌,పాక్‌లో ఉన్న తమ రాయబార కార్యాలయాల సహకారంతో, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. గమనించదగిన విషయం ఏంటంటే, అరాగ్ఛి పాకిస్థాన్‌ను ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండానే రహస్యంగా సందర్శించారు. అక్కడి నాయకులతో చర్చలు జరిపి, అనంతరం తిరిగి ఇరాన్‌కు వెళ్లి తర్వాత న్యూఢిల్లీకి వచ్చారు.