LOADING...
Supreme Court: శబరిమల తీర్పు సమీక్షకు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం
శబరిమల తీర్పు సమీక్షకు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం

Supreme Court: శబరిమల తీర్పు సమీక్షకు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2026
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన మొత్తం 67 పిటిషన్లపై త్వరలో విచారణ చేపట్టనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. మహిళల ప్రవేశంపై నిషేధం అమలులో ఉన్న వివిధ మతపరమైన ప్రదేశాల విషయంలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ మార్చి 14లోపు లిఖితపూర్వక నివేదికలు సమర్పించాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఆలయాలు,ప్రార్థనా స్థలాల నిర్వాహకులను కోర్టు ఆదేశించింది. ఈ కీలక అంశాలపై విచారణ జరిపేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వెల్లడించింది.

వివరాలు 

పిటిషన్లపై విచారణ కోసం రెండు వారాల సమయం 

ఈ పిటిషన్లపై విచారణ కోసం ఏప్రిల్‌ 7 నుంచి ఏప్రిల్‌ 22 వరకు రెండు వారాల సమయాన్ని కేటాయించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఏప్రిల్‌ 7న ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. శబరిమల అంశంతో పాటు దర్గాలు, మసీదుల్లో ముస్లిం మహిళలకు ప్రవేశం కల్పించాల్సిన అంశం, ఇతర మతాలకు చెందిన వారిని వివాహం చేసుకున్న పార్సీ మహిళలకు మతపరమైన ప్రాంగణాల్లో ప్రవేశం నిరాకరించడం వంటి విషయాలపై కూడా కోర్టు సమగ్రంగా విచారణ జరపనుంది.

వివరాలు 

ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ అంశాలపై విచారణ

ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్ మాట్లాడుతూ, 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఏ. బోబ్డే ఆధ్వర్యంలో ఏర్పాటైన తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇప్పటికే ఈ సమీక్ష పిటిషన్లను విచారణకు తీసుకోవాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే కొవిడ్‌ మహమ్మారి కారణంగా అప్పట్లో ఈ కేసుల విచారణను అకస్మాత్తుగా నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఇప్పుడు కొత్త ధర్మాసనంతో మళ్లీ ఈ అంశాలపై విచారణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement