Page Loader
Air Quality: పంట వ్యర్థాలను కాల్చడం విషయంలో.. ఎయిర్‌ క్వాలిటీ కమిషన్‌పై సుప్రీం ఆగ్రహం
ఎయిర్‌ క్వాలిటీ కమిషన్‌పై సుప్రీం ఆగ్రహం

Air Quality: పంట వ్యర్థాలను కాల్చడం విషయంలో.. ఎయిర్‌ క్వాలిటీ కమిషన్‌పై సుప్రీం ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 27, 2024
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధానిలో గాలి కాలుష్యాన్ని అరికట్టడంలో ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ (CAQM) విఫలమవడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. గాలి నాణ్యత పర్యవేక్షణ, వాయు కాలుష్య నియంత్రణకు కావలసిన చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను కాల్చడం విషయంలో ఎటువంటి కమిటీలు ఏర్పాటు చేయలేదని, గతంలో కమిషన్‌ తెలిపిన సూచనలు గాల్లో వినిపిస్తున్న మాటలే అని పేర్కొంది. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణలో మరింత చురుకుగా వ్యవహరించాలని కమిషన్‌కి సూచించింది.

వివరాలు 

 గతంలో చెప్పిన సూచనలు గాల్లో మాటలుగా మిగిలిపోయాయి: సుప్రీం

"పంట వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి కనీసం ఒక్క కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. ప్రతి సంవత్సరం ఈ సమస్యను పరిశీలిస్తున్నప్పుడు, సీఏక్యూఎం చట్టం అమలు కావడం లేదని స్పష్టం అవుతోంది. మీరు కమిటీలు ఏర్పాటు చేశారా? చట్ట ప్రకారం తీసుకున్న చర్యలను కనీసం ఒకటి చూపించండి. దిల్లీ ఎన్‌సీఆర్‌ రాష్ట్రాలకు గతంలో చెప్పిన సూచనలు గాల్లో మాటలుగా మిగిలిపోయాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. మీరు కేవలం మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారని మందలించింది.

వివరాలు 

 సమగ్ర నివేదికను అందజేయాలని సీఏక్యూఎంను సుప్రీం కోర్టు ఆదేశం 

సీఏక్యూఎం ఛైర్‌పర్సన్‌ స్పందిస్తూ, గాలి కాలుష్యాన్ని కట్టడేందుకు మూడు సబ్‌ కమిటీలు ఏర్పాటు చేశామని, ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, అరుదుగా జరిగే అలాంటి సమావేశాలతో ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారో అర్థమవుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలకు ప్రత్యామ్నాయాలను అమలు చేసేందుకు కృషి చేయాలని, ఆ చర్యలపై సమగ్ర నివేదికను సమర్పించాలని సుప్రీం కోర్టు సీఏక్యూఎం కు ఆదేశించింది.