
Godra Case: ఫిబ్రవరి 13న గోద్రా కేసు విచారణ.. సుప్రీంకోర్టు నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
2002లో గోద్రా రైలు ఘటనపై విచారణను ఫిబ్రవరి 13న చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. గుజరాత్ ప్రభుత్వం సహా అనేక మంది దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ జరపనుంది. ఈ కేసు విచారణకు మరో తేదీ ఇవ్వబోమని జస్టిస్ జేకే మహేశ్వరి, అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 2002 ఫిబ్రవరి 27న సబర్మతి రైలులోని ఎస్-6 బోగీలో చెలరేగిన మంటల వల్ల సుమారు 59 మంది ప్రయాణికులు మరణించారు. ఈ కేసులో 2017లో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అనేక మంది సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.
వివరాలు
కేసు ఐదు సార్లు వాయిదా
జీవిత ఖైదు శిక్ష పొందిన 11 మంది నిందితులకు మరణశిక్ష విధించాలంటూ గుజరాత్ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గురువారం విచారణ సమయంలో ఓ నిందితుడి తరఫున లాయర్ హాజరైనప్పటికీ ఆధారాలు సమర్పించలేకపోయారు. గత ఏడాది నుంచి కేసును ఐదు సార్లు వాయిదా వేశామని, ఇక మరలా వాయిదా వేయబోమని జస్టిస్ మహేశ్వరి తెలిపారు. కొందరు నిందితుల క్షమాభిక్ష పిటీషన్లు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయని లాయర్ కోర్టుకు తెలియజేశారు. గుజరాత్ ప్రభుత్వ అప్పీల్పై ముందు విచారణ జరపాలని సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే కోరారు.