Gauri Lankesh: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం.. గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడి విజయం
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు క్రమంగా వెలువడుతున్న నేపథ్యంలో జాల్నా కార్పొరేషన్లో చోటు చేసుకున్న ఒక ఫలితం రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారితీసింది. జాల్నా కార్పొరేషన్ పరిధిలోని ఒక వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన 'శ్రీకాంత్ పాంగార్కర్' విజయం సాధించాడు. సంచలనాత్మకంగా దేశవ్యాప్తంగా కలకలం రేపిన ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కావడం వల్ల ఈ విజయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జాల్నాలోని 13వ వార్డు నుంచి పాంగార్కర్ పోటీ చేయగా, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన ఈ వార్డులో అభ్యర్థిని నిలబెట్టలేదు.
Details
హిందూ జనజాగృతి సమితిలో జాయిన్
గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాంగార్కర్ శివసేనలో చేరినప్పటికీ, దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని శిందే నిలిపివేశారు. పాంగార్కర్కు రాజకీయ అనుభవం కూడా ఉంది. 2001 నుంచి 2006 వరకు శివసేన తరఫున జాల్నా మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా పని చేసిన ఆయనకు, 2011లో పార్టీ టికెట్ నిరాకరించడంతో శివసేనతో విభేదాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత ఆయన హిందూ జనజాగృతి సమితిలో చేరాడు.
Details
2024లో బెయిల్ మంజూరు
ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ను 2017 సెప్టెంబర్లో బెంగళూరులోని ఆమె నివాసంలో దుండగులు కాల్చి హత్య చేసిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడిగా అరెస్టైన పాంగార్కర్కు 2024లో కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందు, 2018లో బాంబులు, ఆయుధాలకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ఆయనను అరెస్టు చేసిన విషయం మనందరికీ తెలిసిందే.