Bomb Threats: విమానాలపై వరుస బాంబు బెదిరింపులు.. అనుమానితుల గుర్తింపు
భారత విమానయాన సంస్థలకు వరుసగా మూడు రోజులుగా బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ పరిస్థితుల్లో పౌర విమానయాన శాఖ అధికారుల ఆధ్వర్యంలో కీలక సమీక్ష సమావేశం జరిగింది. రవాణాపై పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, డీజీసీఏ అధికారులు పాల్గొని వివరాలు వెల్లడించారు. ఈ సమీక్షలో అధికారుల ప్రాథమిక విచారణలో కొన్ని కీలక ఆనవాళ్లు సేకరించినట్లు తెలుస్తోంది.
తీవ్ర ఒత్తిడిలోకి విమానయాన సంస్థలు
మూడు రోజులుగా 12 విమానాలకు బెదిరింపులు రావడం విమానయాన సంస్థలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. సోమవారం ఎయిరిండియా, ఇండిగో విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. మంగళవారం 7 విమానాలకు ఇలాంటి బెదిరింపులు రావడం, బెంగళూరు వెళ్లాల్సిన ఆకాశ విమానాన్ని అత్యవసరంగా ఢిల్లీకి మళ్లించాల్సి రావడం, మరో ఇండిగో విమానాన్ని అహ్మదాబాద్కి దారి మళ్లించడం వంటివి చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో, పౌర విమానాలకు ఇటువంటి బెదిరింపులు రావడం ఆమోదయోగ్యం కాదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించారు.