కాంగ్రెస్ యోగా డే ట్వీట్; ప్రధాని మోదీపై శశి థరూర్ ప్రశంసలు
యోగను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన కృషిని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో జవహర్లాల్ నెహ్రూ యోగా చేస్తున్న ఫోటోను షేర్ చేసింది. యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన, జాతీయ విధానంలో కూడా ఒక భాగం చేసిన నెహ్రూకు ధన్యవాదాలు అని కాంగ్రెస్ తన ట్వీట్లో పేర్కొంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ట్వీట్ను ట్యాగ్ చేస్తూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ కూడా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తమ(కాంగ్రెస్) ప్రభుత్వంతో పాటు యోగాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రధాని మోదీ, విదేశాంగశాఖతో పాటు ప్రతి ఒక్కరిని గుర్తుంచుకోవాలని శశి థరూర్ పేర్కొన్నారు.
శశి థరూర్ ట్వీట్పై రాజకీయ వర్గాల్లో చర్చ
తాను దశాబ్దాలుగా వాదిస్తున్నట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అద్భుతమైన శక్తుల్లో యోగా ఒకటని శశి థరూర్ అన్నారు. దీన్ని గుర్తించడం చాలా గొప్ప విషయం అన్నారు. అయితే ప్రధానమంత్రి కార్యాలయాన్ని, విదేశాంగశాఖను శశి థరూర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ప్రధాని మోదీని పరోక్షంగా ప్రశంసించడంపై కొందరు కాంగ్రెస్ నాయకులు పెదవి విరుస్తున్నారు. యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం లక్ష్యం. యోగా ప్రాముఖ్యతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని డిసెంబర్ 2014న నిర్ణయించింది.