చంద్రయాన్-3 మూన్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశానికి 'శివశక్తి' గా నామకరణం: మోదీ
బెంగళూరులోని పీణ్య పారిశ్రామిక ప్రాంతంలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ సెంటర్లో ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 విజయానికి కృషి చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. రెండు దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ ఈ ఉదయం బెంగళూరు చేరుకున్నారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ చాలా సంతోషకరమైన క్షణమని, దేశానికి తిరిగి వచ్చిన వెంటనే శాస్త్రవేత్తలను కలవాలని, వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు, సెల్యూట్ చేయాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ అన్నారు. చంద్రయాన్-3 మూన్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని 'శివశక్తి' అని పిలుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్లో ప్రకటించారు.
ఇక నుండి ఆగస్టు 23'జాతీయ అంతరిక్ష దినోత్సవం': మోదీ
చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ఆగస్టు 23ను ఇప్పటి నుండి 'జాతీయ అంతరిక్ష దినోత్సవం'గా పిలుస్తామని ఆయన ప్రకటించారు. ఉదయం 7.30 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమై ప్రసంగించారు. "మీ కృషి, అంకితభావానికి తను ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. మీరు దేశాన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లారో అది మామూలు ఎత్తు కాదు, సాధారణ విజయం కాదు' అని ప్రధాని మోదీ అన్నారు. చంద్రయాన్-3 విజయం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధాని భావోద్వేగానికి లోనవుతూ.."భారతదేశం చంద్రునిపై ఉంది.ఇంతకు ముందు ఎవరూ చేరుకోని ప్రదేశానికి చేరుకున్నాం. ఇంతకు ముందు ఎవరూ చేయని పని చేశాం. ఇది నేటి భారతదేశం - బోల్డ్ మరియు బ్రేవ్ అన్నారు.
వాణిజ్యం నుండి సాంకేతిక చెందిన దేశాలలో భారతదేశం మొదటి వరుసలో నిలుస్తుంది: మోదీ
చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ చేయడంలో మహిళా శాస్త్రవేత్తల పాత్రను కూడా ఆయన ప్రస్తావించారు. "భారతదేశం శాస్త్రీయ ప్రయత్నాలకు ఇప్పుడు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు" అని మోదీ అన్నారు. "ఒకప్పుడు మన దేశాన్ని మూడో వరుసలో లెక్కించేవారు. నేడు, వాణిజ్యం నుండి సాంకేతికత వరకు, అభివృద్ధి చెందిన దేశాలలో భారతదేశం మొదటి వరుసలో నిలుస్తోందన్నారు. 'మూడవ వరుస' నుంచి 'మొదటి వరుస' వరకు సాగిన ఈ ప్రయాణంలో 'ఇస్రో' వంటి సంస్థలు గణనీయమైన పాత్ర పోషించాయి' అని ప్రధాని మోదీ అన్నారు.