సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా; 2013 నాటి కేజ్రీవాల్ ట్వీట్ను వెలికితీసిన బేజేపీ
ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయడం, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వాటిని ఆమోదించిన నేపథ్యంలో దిల్లీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా అరెస్టైన తర్వాత బీజేపీ దూకుడు పెంచింది. కేజ్రీవాల్, ఆప్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ విమర్శలు చేస్తోంది. తాజాగా 2013లో కేజ్రీవాల్ చేసిన ట్వీట్ను బీజేపీ వెలికి తీసి ఆప్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. అవినీతికి పాల్పడిన మంత్రులు రాజీనామా చేయాలా? లేదా జైలుకు పంపాలా? అని 2013లో కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను వెలికి తీసిన బీజేపీకి నేత అమిత్ మాళవియా.. ఆప్ నేతలు రెండో ఆప్షన్ను ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు.
మంత్రి వర్గ సమావేశాన్ని జైలులో ఏర్పాటు చేస్తారా?: బీజేపీ
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలో ఉన్నారు. అలాగే మరో ఆప్ కీలక నేత సత్యేందర్ జైన్ మనీలాండరింగ్ కేసులో గత తొమ్మిది నెలలుగా జైలులో ఉన్నారు. జైలులో జైన్ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న వీడియోలు బయటికి రావడంతో వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ఆప్ కీలక నేతలు జైలులో ఉండటంతో మంత్రి వర్గ సమావేశాన్ని జైలులో ఏర్పాటు చేస్తారా అంటూ బీజేపీ నేతలు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ మంగళవారం తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. కేజ్రీవాల్ కూడా వెంటనే ఆమోదించారు.