Telangana: ఎటిఎం కార్డు తరహాలో తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇక స్వైప్ చేస్తే చాలు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందించనుంది.
ఈ కొత్త కార్డులను ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్, యూనిక్ నెంబర్తో రూపొందించనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఉన్న పాత లబ్ధిదారులతో పాటు, కొత్తగా దరఖాస్తు చేసిన వారిలో అర్హులను ఎంపిక చేసి అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయాలని నిర్ణయించింది.
ఈ కార్డుల తయారీ కోసం అధికారులు షార్ట్ టెండర్ ప్రక్రియ చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కార్డు నమూనా అప్రూవల్ కోసం ఫైల్ పంపించగా, అనుమతి రాగానే ప్రింటింగ్ ప్రక్రియ వేగవంతం కానుంది.
Details
ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం పంపిణీ
మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. కోడ్ తొలగిన వెంటనే, మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుంది.
ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై ఎవరి ఫోటో ఉండదు. యూనిక్ నెంబర్తోపాటు ఏటీఎం కార్డు తరహాలో చిప్ ఉండేలా రూపొందించనున్నారు.
ఈ కార్డును స్వైప్ చేస్తే లబ్ధిదారుల వివరాలు, ఆధార్ నెంబర్, చిరునామా, రేషన్ దుకాణం వివరాలు వచ్చేలా ఉంటాయి.
దీంతో భవిష్యత్తులో ఎక్కడైనా స్మార్ట్ కార్డుతో రేషన్ పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Details
దశలవారీగా కార్డుల పంపిణీ
మీ సేవా ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం 1.50 లక్షల దరఖాస్తులు అందినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
గతంలో దరఖాస్తు చేసిన వారిలో అర్హులను ఎంపిక చేసి, కొత్తగా దరఖాస్తు చేసిన వారిని కూడా పరిశీలన చేశారు.
అర్హులైన వారికి దశల వారీగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.