బెంగళూరులో విపక్షాల రెండో భేటీకి సోనియాగాంధీ.. 16న దిల్లిలో విపక్ష నేతలకు ప్రత్యేక విందు
కేంద్రంలోని భాజపాను ఎదుర్కోనేందుకు భారత విపక్ష పార్టీలు మరోసారి భేటీ కానున్నాయి. ఈ మేరకు బెంగళూరులో జులై 17 నుంచి 18 వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కమల దళాన్ని ఎదుర్కొనేందుకు ఉమ్మడి వ్యూహ రచనకు రెండోసారి భేటీ కానున్నాయి. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నారు. మరోవైపు ఈ భేటీకి ఒక్క రోజు ముందు విపక్ష నేతలకు సోనియా గాంధీ ప్రత్యేక విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తొలి విపక్ష నేతల భేటీలో కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ పాల్గొన్నారు. అయితే రెండో భేటీకి ఖర్గేతో కలిసి సోనియా బెంగళారు రానున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
తొలి భేటీలో 15 పార్టీలు హాజరుకాగా, బెంగుళూరులో 24 పార్టీలకు ఆహ్వానం
విపక్షల తొలి భేటీని జూన్ 23న బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ నేతృత్వంలో పట్నా వేదికగా నిర్వహించారు. ఈ భేటీలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ సహా 15 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. అయితే బెంగళూరులో జరగనున్న రెండో భేటీకి దాదాపు 24 రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. పట్నా భేటీపై గతంలోనే భాజపా నేతలు స్పందించారు. అదో ఫొటో సెషన్ అని ఎద్దేవా చేశారు. మరోవైపు సదరు విపక్ష నేతల భేటీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చురకలు అంటించారు. వారంతా దాదాపు రూ. 20 లక్షల కోట్ల మేర కుంభకోణాలకు పాల్పడ్డవారేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.