
Special trains: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. వివిధ మార్గాల్లో 52 ప్రత్యేక రైళ్లు!
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్లో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా వివిధ మార్గాల్లో మొత్తం 52 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రత్యేక సర్వీసులు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. రైల్వే శాఖ వివరాల ప్రకారం విశాఖపట్నం-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. విశాఖపట్నం-తిరుపతి (08583) స్పెషల్ ట్రైన్ ఈ నెల 15 నుంచి నవంబర్ 24 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. అలాగే తిరుపతి-విశాఖపట్టణం (08584) ట్రైన్ ఈ నెల 16 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి మంగళవారం నడుస్తుందని తెలిపారు.
Details
తిరుపతి-అనకాపల్లె మార్గంలో 8 ప్రత్యేక రైళ్లు
ఈ మార్గంలో మొత్తం 22 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. అదే విధంగా తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మార్గంలో అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 27 వరకు 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక సంబల్పూర్-ఇరోడ్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. సంబల్పూర్-ఇరోడ్ (08311) రైలు ఈ నెల 17 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి బుధవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. తిరుగు ప్రయాణంలో ఇరోడ్-సంబల్పూర్ (08312) ట్రైన్ ఈ నెల 19 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో కూడా మొత్తం 22 ప్రత్యేక సర్వీసులు ఉంటాయని వివరించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది.