Special Trains :రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా,దీపావళికి 1400 ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే పండగల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగల సమయంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని, ప్రయాణీకుల సౌకర్యం కోసం 1400 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాల డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రిజర్వేషన్లు నిండిపోతున్నాయి. ఈ పరిస్థితిలో ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. పండుగల సీజన్ లో రద్దీ దసరా,దీపావళి సమయంలో రైళ్లు పూర్తిగా రద్దీగా మారుతున్నాయి.ప్రజలు సొంత ప్రాంతాలకు వెళ్లి రావడంలో రైళ్లలో ఖాళీలు లేకుండా పోయాయి. ప్రైవేట్ బస్సులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో,దక్షిణ మధ్య రైల్వే అధిక రద్దీ ఉన్న మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
1400 ప్రత్యేక రైళ్లు
తెలుగు రాష్ట్రాల తో పాటు బీహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్కువ రైళ్లు నడిపేందుకు డిమాండ్ ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ రైళ్లు అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు వేర్వేరు తేదీల్లో నడవనున్నాయి. ప్రయాణీకుల పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తూ, రిజర్వ్ చేయని కోచ్ లు కోసం మొబైల్ యాప్ యూటీఎస్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు.
రద్దీ ప్రభావం
పండుగ సెలవులు కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. వెయిటింగ్ లిస్ట్ వందల సంఖ్యలో పెరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపుకు వెళ్లే రైళ్లలో పెద్ద రద్దీ కనిపిస్తోంది. ఈ రద్దీకి ప్రతిపాదనగా ప్రత్యేక రైళ్లు నడిపినా, ప్రయాణీకులకు వాటి పైన పూర్తి సమాచారం అందడం లేదని తెలుస్తోంది. జనరల్ బోగీల్లోకి కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. రాబోయే రోజుల్లో పండుగల సమయంలో దక్షిణ మధ్య రైల్వే మరింత ప్రత్యేక రైళ్లను ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది, తద్వారా ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేందుకు చర్యలు తీసుకోనుంది.