Bhogapuram airport: రూ.4,650 కోట్లతో భోగాపురం విమానాశ్రయ పనులు వేగవంతం
ఈ వార్తాకథనం ఏంటి
విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ప్రథమ దశలో రూ.4,650 కోట్ల వ్యయంతో జీఎమ్మార్ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టింది.
సంస్థ ప్రకారం 2026 జూన్ నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా జనవరి నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించింది.
ఎన్హెచ్16 నుంచి విమానాశ్రయానికి అనుసంధాన రహదారి నిర్మాణానికి భోగాపురం మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో 60.08 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో 20.22 ఎకరాలకు పరిహారం చెల్లించారు. సవరవిల్లి పరిధిలో 39.86 ఎకరాల భూమికి సంబంధించిన రూ.19.89 కోట్ల పరిహారాన్ని న్యాయస్థానంలో డిపాజిట్ చేశారు.
Details
సిబ్బంది నివాస సముదాయ నిర్మాణానికి 24.30 ఎకరాలు
ప్రత్యామ్నాయ రోడ్ల ఏర్పాటుకు రావాడ, కవులువాడ ప్రాంతాల్లో 3.13 ఎకరాలను స్వాధీనం చేసుకుని, 0.78 ఎకరాలకు రూ.47.84 లక్షలు చెల్లించారు.
ఇంకా రూ.3.19 కోట్లు చెల్లించాల్సి ఉంది. ముంజేరు వద్ద ల్యాండ్ పార్శిల్-1 వరకు రోడ్డు నిర్మాణానికి 1.11 ఎకరాలను గత నెలలో రైతులు అప్పగించగా, వారికి రూ.71.25 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది.
బసవపాలెం వద్ద విమానాశ్రయ సిబ్బంది నివాస సముదాయం నిర్మాణానికి 24.30 ఎకరాలు కేటాయించారు.
132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు కోసం 4.50 ఎకరాలను స్వాధీనం చేసుకోగా, ఇందుకు రూ.70.21 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.
Details
ట్రయన్ రన్ పూర్తి చేసిన ఆర్డబ్ల్యూఎస్
జాతీయ రహదారి నుంచి విమానాశ్రయం వరకు ట్రంపెట్ నిర్మాణానికి 19.75 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో భూమి యజమానులకు రూ.14.43 కోట్ల పరిహారం చెల్లించనున్నారు. మిగిలిన భూమికి రూ.22 కోట్ల నిధులు అవసరం.
ఫేజ్-1లో మార్చి మొదటి వారం నుంచి రోజుకు 1.7 ఎంఎల్డీ నీటి సరఫరా కోసం ఆర్డబ్ల్యూఎస్ ఇప్పటికే ట్రయల్రన్ పూర్తి చేసింది.
ఫేజ్-2లో 3.3 ఎల్ఎండీ అవసరమని జీఎమ్మార్ సంస్థ ప్రభుత్వం వద్ద విజ్ఞప్తి చేసింది. దీని కోసం తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.