Page Loader
Puri stampede: పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి, కలెక్టర్‌, ఎస్పీ బదిలీ
పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి, కలెక్టర్‌, ఎస్పీ బదిలీ

Puri stampede: పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి, కలెక్టర్‌, ఎస్పీ బదిలీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 29, 2025
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశాలోని పూరీ జిల్లాలో జ‌రిగిన జగన్నాథ రథయాత్ర వేళ ఘోరవిషాదం చోటుచేసుకుంది. గుండిచా ఆలయం వద్ద ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ దుర్ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్‌, పోలీస్ సూపరింటెండెంట్ వినిత్ అగర్వాల్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఖుర్దా కలెక్టర్‌గా ఉన్న చంచల్ రాణాను కొత్తగా పూరీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా నియమించారు. అలాగే ఏడీజీ(క్రైమ్)గా ఉన్న సీనియర్ పోలీస్ అధికారి పినాక్ మిశ్రా పూరీ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Details

తొక్కిసలాట ఘటనపై తీవ్ర అసంతృప్తి

తొక్కిసలాట ఘటనపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది భక్తులు తరలివచ్చే రథయాత్రను నిర్వహించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని, భద్రతా ఏర్పాట్లు సరిగ్గా లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర సేవలు, అంబులెన్సులు కూడా సమయానికి అందుబాటులో లేకపోవడంతో తీవ్రంగా గాయపడిన కొందరికి చికిత్స ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఘటనపై ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ స్పందించారు. ప్రభుత్వపరంగా భక్తులపై క్షమాపణలు కోరారు. భద్రతా వైఫల్యాలపై ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రథయాత్ర ముగిసే వరకూ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.