Page Loader
Kolkata: కోల్‌కతాలో మరో దారుణ ఘటన.. న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!
కోల్‌కతాలో మరో దారుణ ఘటన.. న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!

Kolkata: కోల్‌కతాలో మరో దారుణ ఘటన.. న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 27, 2025
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతాలోని ఒక ప్రఖ్యాత లా కళాశాలలో భయానక ఘటన చోటుచేసుకుంది. అక్కడే చదువుతున్న ఓ లా విద్యార్థినిపై కాలేజీ ప్రాంగణంలోనే సామూహిక అత్యాచారం జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్‌లోని మరో ప్రాంతంలో ఒక జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం ప్రకారం,ఈనెల 25వతేదీ రాత్రి దక్షిణకోల్‌కతాలోని కస్బాలో ఉన్న సౌత్ కోల్‌కతా లా కళాశాలలో ఈ దారుణం జరిగింది. బాధిత విద్యార్థిని కొంతమంది వ్యక్తులు బలవంతంగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో,వెంటనే కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

వివరాలు 

 దారుణ ఘటనపై తీవ్రంగా స్పందించిన అమిత్ మాలవియా

అరెస్టు అయిన వారిలో ఇద్దరు కళాశాల సిబ్బందిగా పనిచేస్తుండగా, మరొకరు ఆ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థిగా గుర్తించారు. బాధిత విద్యార్థినికి వైద్య సహాయం అందించి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కేసుకు సంబంధించి ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్‌ బృందం పరిశీలిస్తోంది. ఈ కేసును అన్ని కోణాల్లో విశ్లేషిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై బీజేపీ నేత అమిత్ మాలవియా తీవ్రంగా స్పందించారు. సామూహిక అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాలు 

పశ్చిమ బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదు  

''ఇది చాలా దారుణం. లా విద్యార్థినిపై కాలేజీలో సామూహిక అత్యాచారం జరిగింది. నిందితుల్లో ఒకరు పూర్వ విద్యార్థి కాగా, మిగిలిన ఇద్దరూ కాలేజీ సిబ్బంది. షాకింగ్ విషయమేమంటే.. నిందితుల్లో ఒకరు టీఎంసీ పార్టీకి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఆర్జీకర్ ఘటనను ఇంకా మరువకముందే మరో దారుణం వెలుగులోకి రావడం భయాందోళన కలిగిస్తోంది. మమతా బెనర్జీ పాలనలో మహిళలకు పశ్చిమ బెంగాల్‌లో రక్షణ లేకుండా పోయింది. అత్యాచారాలు ఇక్కడ సామాన్యంగా మారిపోతున్నాయి. బాధిత విద్యార్థిని, ఆమె కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. ఈ కేసులో ప్రతి ఒక్క నిందితుడికి శిక్షపడేవరకు మేము ఊరుకోం,'' అని ఆయన సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్‌లో పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమిత్ మాలవియా చేసిన ట్వీట్