LOADING...
Supreme Court: ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Supreme Court: ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 04, 2025
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రకు సంబంధించిన ఇలాంటి కేసులో విచారణ ఇప్పటికే పూర్తై, తీర్పు రిజర్వ్‌ చేయబడిందని పేర్కొంటూ, ఆ కేసులో తీర్పు వెలువడిన తర్వాతనే ఓటుకు నోటు కేసును విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్‌ జేకే మహేశ్వరి మాట్లాడుతూ, జనవరికల్లా మహారాష్ట్ర కేసు తీర్పు వచ్చే అవకాశముందని, ఆ తర్వాత అన్ని కోణాల్లో వాదనలు విని తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విచారణ సందర్భంగా రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు.

Details

అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్లు వర్తించవు

ఆయన మాట్లాడుతూ, అప్పటి అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచం ఇచ్చేవారిపై ఆ చట్టం నిబంధనలు వర్తించవని, కాబట్టి ఈ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే ఓటేయడం ప్రభుత్వ విధుల పరిధిలోకి రాదని, అందువల్ల ఐపీసీ సెక్షన్లు మినహా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు వర్తించవని వివరించారు. ఇక మరో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ మాట్లాడుతూ, జనరల్‌ డైరీలో నమోదు చేయకుండానే, ఎఫ్‌ఐఆర్‌ లేకుండా ట్రాప్‌ వేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ కారణాల ఆధారంగా కేసును కొట్టేయాలని ఆయన విన్నవించారు. వారి వాదనలు విన్న ధర్మాసనం, ఈ అంశాలన్నింటినీ తదుపరి విచారణలో సమగ్రంగా పరిశీలిస్తామని వెల్లడిస్తూ, కేసు విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.