Supreme Court: ఇకపై సుప్రీంకోర్టులో అన్నికేసుల విచారణలు ప్రత్యక్షప్రసారం..!
సుప్రీంకోర్టు చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇకపై సుప్రీంలో జరిగే అన్ని కేసుల విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన యాప్ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ క్రమంలో పలు లోటుపాట్లను సరిదిద్దిన తరువాత త్వరలో అమలులోకి తీసుకురానున్నారు. అచ్చంగా రెండేళ్ల క్రితం రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం మొదలైంది. యూట్యూబ్ వేదికగా వాటిని ప్రసారం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో తొలి విచారణ 'సేన vs సేన' కేసుపై జరిగింది. మహారాష్ట్రలో శివసేన పార్టీలో శిందే వర్గం తిరుగుబాటు చేయడం,ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం వంటి పరిణామాలు సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి.
లైవ్ స్ట్రీమింగ్ చేయాలని 2018లోనే నిర్ణయం
శివసేన అసలు తమదేనని ఠాక్రే,శిందే వర్గాలు తారసపడినప్పటికీ, ఈ వ్యవహారంపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు కేసుల లైవ్ స్ట్రీమింగ్ చేయాలని 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆచరణలోకి రాలేదు. అయితే భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ పదవీ విరమణ రోజు ఆయన నేతృత్వంలోని ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా సుప్రీంకోర్టు కార్యకలాపాలను లైవ్ స్ట్రీమింగ్ చేయడం మొదలైంది. ఆ తరువాత రాజ్యాంగ ధర్మాసనం విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఈ చారిత్రక నిర్ణయం ద్వారా పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 వంటి ప్రధానమైన కేసుల విచారణలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా వీక్షించగలిగారు.