Stray Dogs Case: వీధి కుక్కలపై కేసు.. రాష్ట్రాల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
వీధి కుక్కల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సోమవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కలను పట్టుకోవడం,వాటి సంతానోత్పత్తిని నియంత్రించడం,వాటిని శిబిరాలకు తరలించడం వంటి చర్యల వివరాలు సమర్పించకుండా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టులో జారీ చేసిన ఉత్తర్వుల తరువాత కూడా వీధి కుక్కల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయస్థానం కఠినంగా స్పందించింది. "ఇప్పటికీ రాష్ట్రాల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.వీధి కుక్కల దాడులు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ ఘటనల వల్ల విదేశాలలో భారత్ ప్రతిష్ట దెబ్బతింటోంది.మేము కూడా వార్తా కథనాలను గమనిస్తున్నాం. రెండు నెలల గడువు ఇచ్చినా ఇప్పటివరకు స్పందన లేదు. అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై ఆలస్యానికి కారణాలు వివరించాలి," అని సుప్రీంకోర్టు ఆదేశించింది.
వివరాలు
పరిస్థితి ఎలా మారింది?
కోర్టు తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే అఫిడవిట్లు సమర్పించాయి. అయితే అవి దీపావళి సెలవుల సమయంలో దాఖలు చేయడంతో రికార్డుల్లో చేరలేదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఢిల్లీ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ సమాధానం ఇచ్చినప్పటికీ, ప్రభుత్వ అఫిడవిట్ రాకపోవడంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. వీధి కుక్కల దాడుల కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో రేబిస్ కేసులు పెరుగుతున్నాయని వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న అన్ని వీధి కుక్కలను ఎనిమిది వారాల్లోపు శెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
వివరాలు
ఆదేశాల అమలుకు సంబంధించి అఫిడవిట్లు దాఖలుకి రెండు నెలల సమయం
తదుపరి, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజరియా లతో కూడిన మరో ధర్మాసనం ఆ ఉత్తర్వులను పునర్విమర్శించింది. విచారణ అనంతరం రేబిస్ లక్షణాలు ఉన్న లేదా అత్యుత్సాహంగా ప్రవర్తించే కుక్కలు తప్ప, మిగిలిన వాటిని తిరిగి వదిలేయాలని ఆదేశించింది. వ్యాక్సిన్ ఇవ్వడం, స్టెరిలైజేషన్ చేయడం పూర్తయిన తర్వాత, వాటిని పట్టిన ప్రాంతాలకే మళ్లీ విడిచిపెట్టాలని పేర్కొంది. దీంతో ఆగస్టు 11న ఇచ్చిన తీర్పులో సవరణలు చేసి, రాష్ట్రాలు ఆదేశాల అమలుపై అఫిడవిట్లు సమర్పించేందుకు రెండు నెలల గడువు ఇచ్చింది.