LOADING...
Supreme Court: ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court: ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2025
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ట్రైబ్యునళ్ల సంస్కరణల (హేతుబద్ధీకరణ,సర్వీస్‌ నిబంధనలు) చట్టం-2021పై పిటిషన్లకు బుధవారం కీలక తీర్పు వెలువడింది. ఈ చట్టంలోని నియామకాలు, సర్వీస్‌ షరతులు, పదవీకాల వ్యవధులు వంటి అంశాలకు సంబంధించిన అనేక నిబంధనలను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ముందే కొట్టివేసిన నిబంధనలను చిన్నచిన్న సవరణలు చేసినట్లుగా చూపిస్తూ తిరిగి అమల్లోకి తీసుకురావడం రాజ్యాంగపరంగా సరైంది కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ట్రైబ్యునల్స్‌ రిఫార్మ్స్‌ చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేర్చిన నూతన నిబంధనలు న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, అధికార వికేంద్రీకరణ సూత్రాల‌కు విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్ నేతృత్వంలోని బెంచ్‌ వ్యాఖ్యానించింది.

వివరాలు 

ట్రైబ్యునళ్లలో పనిచేసే సభ్యులు 62 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగవచ్చు 

''2021 ఆర్డినెన్స్‌తో పాటు వచ్చిన చట్టాన్ని పరిశీలించాం. కోర్టు ఇప్పటికే రద్దు చేసిన నిబంధనలను కొద్దిపాటి మార్పులతో మళ్లీ పెట్టారు. ఇది రాజ్యాంగానికి అనుగుణంగా ఉండదు'' అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ట్రైబ్యునల్ సభ్యుల పదవీకాలానికి సంబంధించిన గత న్యాయపరమైన మార్గదర్శకాలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చింది. ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌, కస్టమ్స్‌, ఎక్సైజ్‌, సర్వీస్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునళ్లలో పనిచేసే సభ్యులు 62 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగవచ్చని తెలియజేసింది. అలాగే, ట్రైబ్యునళ్ల ఛైర్‌పర్సన్లు లేదా అధ్యక్షుల రిటైర్మెంట్‌ వయస్సును 65 సంవత్సరాలుగా కొనసాగిస్తూ స్పష్టం చేసింది.

వివరాలు 

ట్రైబ్యునళ్లలో న్యాయ సభ్యులు, ఇతర సభ్యుల నియామక నిబంధనల్లో మార్పులు

2021లో అమల్లోకి వచ్చిన ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టంతో ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ సహా అనేక అప్పిలేట్‌ ట్రైబ్యునళ్లను రద్దు చేశారు. అలాగే, అనేక ట్రైబ్యునళ్లలో న్యాయ సభ్యులు, ఇతర సభ్యుల నియామక నిబంధనల్లో మార్పులు చేశారు. ఈ చట్టంలోని పలు నిబంధనలను వ్యతిరేకిస్తూ మద్రాస్‌ బార్‌ అసోసియేషన్‌ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లపై విచారణ ముగిసిన తర్వాత కోర్టు నిర్ణయాన్ని రిజర్వ్‌ చేయగా, బుధవారం తుది తీర్పును ప్రకటించింది.