Page Loader
Rajya Sabha: రాజ్యసభకు సర్‌ప్రైజ్ ఎంట్రీ.. ఆయన ఎవరంటే?
రాజ్యసభకు సర్‌ప్రైజ్ ఎంట్రీ.. ఆయన ఎవరంటే?

Rajya Sabha: రాజ్యసభకు సర్‌ప్రైజ్ ఎంట్రీ.. ఆయన ఎవరంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 23, 2025
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు కోసం ఉత్కంఠ రేపుతోంది.

ఈ సందర్భంగా ఎన్నికల సంఘం ఇప్పటికే ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఏపీలో ప్రస్తుతం అధికార కూటమిగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేనలు ఈ సీటు విషయంలో సామరస్యంగా ముందుకెళ్తున్నాయి. ఈ స్థానం బీజేపీ ఖాతాలోకెళ్లడంతో, తుది అభ్యర్థి ఎంపికపై చర్చలు జోరందుకున్నాయి.

Details

రేసులో అన్నామలై - మంద కృష్ణ మాదిగ

సాయిరెడ్డి స్థానంలో బీజేపీ నేత అన్నామలైను ఎంపిక చేయాలనే ప్రతిపాదన జోరుగా విన్పిస్తోంది.

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడైన ఆయనను ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలన్న ఆలోచన బీజేపీలో బలంగా వ్యక్తమవుతోంది.

అయితే మరోవైపు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్సీఎస్‌) నాయకుడు మంద కృష్ణ మాదిగ పేరు కూడా చివరి నిమిషంలో రేసులోకి రావడం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే బీసీ సంఘాల నాయకుడు ఆర్. కృష్ణయ్య వైసీపీకి రాజీనామా చేసి బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో, ఈసారి మంద కృష్ణ మాదిగకు అవకాశం కల్పించాలని ఓ వర్గం భావిస్తోంది.

Details

 చంద్రబాబు - అమిత్ షా భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఈ రాజ్యసభ సీటు అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా అన్నామలై పేరు ప్రధానంగా చర్చకు వచ్చినప్పటికీ, మంద కృష్ణ మాదిగ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

బీజేపీకి చెందిన నేతలు మాత్రం, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని జాతీయ రాజకీయాల్లో అన్నామలై పాత్రను పెంచాలని భావిస్తున్నారు.

Details

వ్యూహాత్మక నిర్ణయం వెనుక వ్యూహం

తమిళనాడులో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, బీజేపీ ఇప్పటికే అన్నాడీఎంకేతో పొత్తును ఖరారు చేసింది.

ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అన్నామలైను తొలగించి, జాతీయ రాజకీయాల్లో ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది.

ఆయనను ఏపీ నుంచి రాజ్యసభకు పంపడం ద్వారా ఆ రాష్ట్రంలో బీజేపీ పట్టు మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌తో కలసి బీజేపీ ఏపీలో కొత్త సమీకరణాలకు నాంది పలికిన వేళ, అన్నామలై లాంటి నేతను అక్కడి నుంచి పంపడం పార్టీ వ్యూహాలకు బలమవుతుందన్నది బీజేపీ నేతల విశ్వాసం.

Details

కొత్త వ్యూహాలను రచించిన బీజేపీ

ఈ సీటు కోసం అన్నామలై, మంద కృష్ణ మాదిగ మధ్య కాస్త పోటీ నెలకొన్నా.. బీజేపీ అధిష్టానం అన్నామలై వైపు మొగ్గుచూపుతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఆయనకు కేంద్ర మంత్రిగా అవకాశం దాదాపుగా ఖాయమైందన్న చర్చ రాజకీయం మరింత రసవత్తరంగా మార్చుతోంది.

ఏపీ నుంచి అన్నామలై రాజ్యసభకు ఎంట్రీ ఇవ్వడం ద్వారా బీజేపీ కొత్త వ్యూహాలకు నాంది పలికేలా ఉంది.