
Tejas Mark-1A: తేజస్ మార్క్-1ఏ విమానం కోసం మూడో ఇంజిన్ అందించిన జీఈ.. వేగవంతం కానున్న ఉత్పత్తి,డెలివరీలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన దశలోకి అడుగు పెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్ మార్క్-1ఏ' ఉత్పత్తిలో ఎదురైన ప్రధాన అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతున్నాయి. ఈ విమానానికి గుండెకాయలాంటి ఇంజిన్ల సరఫరాను అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) ఏవియేషన్ వేగవంతం చేసింది. ఆ క్రమంలో, గురువారం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) మూడో జీఈ-ఎఫ్404 ఇంజిన్ను స్వీకరించింది. అలాగే, ఈ నెల చివరి వరకు మరో ఇంజిన్ అందనుండటం వల్ల, తేజస్ యుద్ధ విమానాల ఉత్పత్తి, డెలివరీలు ఇకపై మరింత వేగంగా సాగుతాయి.
వివరాలు
2021లో 99 ఇంజిన్ల కోసం జీఈ ఏవియేషన్తో భారీ ఒప్పందం
2021లో హెచ్ఏఎల్, జీఈ ఏవియేషన్ మధ్య 99 ఇంజిన్ల కోసం భారీ ఒప్పందం కుదిరింది. సుమారు 716 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 5,375 కోట్లు) విలువైన ఈ ఒప్పందం తేజస్ ప్రోగ్రామ్ కోసం అత్యంత కీలకం. ఒప్పందం ప్రకారం, జీఈ-ఎఫ్404 కుటుంబంలో అత్యధిక థ్రస్ట్ సామర్థ్యం కలిగిన ఎఫ్404-జీఈ-ఐఎన్20 వేరియంట్ ఇంజిన్లను హెచ్ఏఎల్కు సరఫరా చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 12 ఇంజిన్లను అందిస్తామని జీఈ హామీ ఇచ్చింది. తాజా సరఫరాలతో ఈ ప్రక్రియకు సానుకూల గాలి ఏర్పడింది. గతంలో ఇంజిన్ల అందుబాటులో జాప్యం, అలాగే దేశీయంగా అభివృద్ధి చేసిన రాడార్ను విమానంలో అనుసంధానించడంలో సాంకేతిక సమస్యలు తేజస్ మార్క్-1ఏ ఉత్పత్తి ఆలస్యమైంది.
వివరాలు
బెంగళూరులో రెండు,నాసిక్లో ఒక ఉత్పత్తి లైన్
వాస్తవానికి, నాసిక్లోని కొత్త ఉత్పత్తి కేంద్రం నుండి తొలి విమానాన్ని జూలై చివరి వరకు సిద్ధం చేయాలని హెచ్ఏఎల్ ఛైర్మన్ డీకే సునీల్ ప్రకటించారు. కానీ, పై కారణాల వల్ల అది సాధ్యంకాకపోయింది. ఇప్పుడు ఇంజిన్లు అందుబాటులోకి రావడంతో, ఉత్పత్తి ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. హెచ్ఏఎల్ ప్రస్తుతం బెంగళూరులో రెండు,నాసిక్లో ఒక ఉత్పత్తి లైన్ను నడుపుతోంది. ఈ ఏడాది నాసిక్ ప్లాంట్ నుండి మూడు నుంచి నాలుగు విమానాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాసిక్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం ఏటా ఎనిమిది విమానాలు. అదనంగా, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఉత్పత్తిని పెంచేందుకు హెచ్ఏఎల్ కృషి చేస్తోంది.
వివరాలు
2021 జనవరిలో రూ. 46,898 కోట్ల విలువైన ఆర్డర్కు ఆమోదం
వెమ్ టెక్నాలజీస్, ఆల్ఫా, ఎల్ అండ్ టీ వంటి సంస్థలు విమానంలోని కీలక భాగాలు..సెంటర్ ఫ్యూసిలేజ్, రియర్ ఫ్యూసిలేజ్, రెక్కల తయారీలో భాగస్వామ్యంగా వ్యవహరిస్తున్నాయి. వీరి సహకారంతో, ఏటా మరో ఆరు విమానాలను ఉత్పత్తి చేసి మొత్తం సామర్థ్యాన్ని 30 విమానాలకు పెంచాలని హెచ్ఏఎల్ భావిస్తోంది. భారత వాయుసేన (ఐఏఎఫ్) అవసరాల కోసం 83 తేజస్ మార్క్-1ఏ విమానాలు (73 ఫైటర్, 10 ట్రైనర్) కొరకు కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) 2021 జనవరిలో రూ. 46,898 కోట్ల విలువైన ఆర్డర్కు ఆమోదం ఇచ్చింది.
వివరాలు
ఇప్పటికే 6 విమానాలు సిద్ధం, ఇంజిన్ల రాకతో పరీక్షలు వేగవంతం
ఒప్పందం ప్రకారం, డెలివరీలు 36 నెలల్లో ప్రారంభం కావాలి. ఇప్పటివరకు ఆరు విమానాలు నిర్మాణం పూర్తిచేసి,ఇంజిన్ల కోసం తుది పరీక్షలకు వేచి ఉన్నాయి. కొత్త ఇంజిన్ల రాకతో, ఈ పరీక్షల ప్రక్రియ వేగవంతం అవుతుంది. మునుపటి తేజస్ మార్క్-1 తో పోలిస్తే, మార్క్-1ఏ వెర్షన్లో ఏవియానిక్స్, ఆయుధ వ్యవస్థలు సహా 43 రకాల కీలక మెరుగుదలలు చోటు చేసుకున్నాయి.