తెలంగాణలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవే.. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే మరో రెండు రోజులూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంఓ కార్యాలయం వెల్లడించింది. గురువారం వరదలపై సమీక్షించిన సీఎం, సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రితో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ముంపు, లోతట్టు ప్రాంతాల్లో అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా మెలగాలని ఆదేశించారు. శనివారం మొహర్రం కారణంగా ప్రభుత్వ విద్యాసంస్థలు తిరిగి సోమవారమే పునఃప్రారంభం కానున్నాయి.
పలు జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం
ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత జిల్లాలకు ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాకు పీ.గౌతమ్, ములుగు జిల్లాకు కృష్ణ ఆదిత్య, మంచిర్యాల జిల్లాకు భారతి హోళికేరి, నిర్మల్ జిల్లాకు ముషారఫ్ అలీని నియమించారు. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం చెందుతోంది.దీంతో గత 3 రోజులుగా హైదరాబాద్ సిటీ తడిసి ముద్ద అయ్యింది. గురువారం రాత్రి గంటకు 5 సె.మీ. నుంచి 6 సె.మీ వరకు వానలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె.నాగరత్న వెల్లడించారు. ఈ మేరకు సిటీలో హై అలెర్ట్ ప్రకటించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర సందర్భాల్లో తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు.