
LRS: లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకంపై ప్రభుత్వ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) అమలు దశలో, తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
గత నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్కు అనుమతి ఇచ్చింది.
అదనంగా, ఎల్ఆర్ఎస్ ఫీజులో 25% రాయితీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇకపై, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించింది.
మార్చి 31లోగా రిజిస్ట్రేషన్లు
ఈ అవకాశాన్ని మార్చి 31లోగా వినియోగించుకున్న వారికి మాత్రమే ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తించనుంది.
ఈ అంశంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, సీఎస్ శాంతికుమారిలతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఎల్ఆర్ఎస్ అమలును వేగవంతం చేయాలని, పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
వివరాలు
అనుమతి లేని లే అవుట్లకు వెసులుబాటు
గతంలో అనుమతి లేని లే అవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించింది.
దీంతో వాటిని కొనుగోలు చేసినవారికి నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేకుండా పోయింది.
ఇప్పుడు, ప్రభుత్వం ఈ నిషేధాన్ని సడలిస్తూ, లే అవుట్లలోని పెండింగ్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుగా కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
ప్లాట్ల రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం కల్పించిన సౌకర్యం
వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసినవారు: రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
లే అవుట్లలో విక్రయం కాకుండా మిగిలిన ప్లాట్లు: పెద్దసంఖ్యలో అమ్ముడుపోని ప్లాట్లను కూడా ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
వివరాలు
రిజిస్ట్రేషన్కు అర్హత పొందేందుకు క్రమబద్ధీకరణ ద్వారా వీలు
ఉదాహరణకు: ఒక లే అవుట్లో 10% ప్లాట్లు ఇప్పటికే రిజిస్టర్ అయితే, మిగిలిన 90% ప్లాట్లు రిజిస్ట్రేషన్కు అర్హత పొందేందుకు క్రమబద్ధీకరణ ద్వారా వీలు కల్పిస్తారు. రాయితీ పొందేందుకు ప్రజలు త్వరగా స్పందించాలి
ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసి, విక్రయ దస్తావేజు కలిగినవారు మార్చి 31లోగా స్పందిస్తే, రుసుములో రాయితీ పొందే అవకాశం ఉంటుంది.
''నాలుగేళ్లుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు, ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలి'' అని మంత్రులు సూచించారు.
వివరాలు
ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు
నిషేధిత జాబితాలోని భూముల్లో ఉన్న ప్లాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినవారికి చాలా ఊరట లభించనుంది.
ఎల్ఆర్ఎస్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇచ్చిన ఈ అవకాశం, ప్రత్యేకించి నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి పెద్ద ఊరటగా మారనుంది.