
Rain Alert: తెలంగాణలో రానున్న నాలుగు రోజులపాటు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
జూన్ 15వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వర్షపాతం ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గురువారం విడుదలైన వాతావరణ సూచనల ప్రకారం, కనీసం పది జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని ఐఎండీ పేర్కొంది.
వీటితో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.
ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్,నిజామాబాద్,ఆదిలాబాద్,ఖమ్మం,వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.
వివరాలు
ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే తక్కువ
మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అమలులో ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే, ప్రస్తుతం మేఘావృత వాతావరణం కొనసాగుతోంది.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశముంది.
ఈ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే తక్కువగా ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు.
ఈ వారం ప్రారంభంలోనే హైదరాబాద్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యింది.
రాబోయే వర్షాల తీవ్రత మరింత పెరిగితే, ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రమాదంలో ఉండే ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అత్యవసరమైతే తప్ప, ప్రయాణాలు నివారించాలని వాతావరణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
అలాగే చెట్లు లేదా బలహీనంగా ఉన్న నిర్మాణాల కింద తలదాచుకోవద్దని హెచ్చరించారు.
ఐఎండీ, స్థానిక యంత్రాంగం తరచూ ఇచ్చే సూచనలు పాటిస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.